హరికథ ఘంటశాల గానం శ్రీ శ్రీ రచన

శ్రీనగజా తనయం సహృదయం
చింతయామి సదయం త్రిజగన్మహోదయం

శ్రీరామ భక్తులారా! ఇది సీతాకళ్యాణ సత్కథ. నలభైరోజులనుంచీ చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకు వస్తున్నాను. అంచేత కించిత్ గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తున్నది. నాయనా కాస్త పాలు మిరియాలు ఏమైనా...

చిత్తం! సిద్ధం!

భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాలనుంచీ విచ్చేసిన వీరాధివీరులలో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్య సుందరమూర్తి,ఆహా! అతడెవరయ్యా అంటే -

రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు
వాడు నెలరేడు సరిజోడు మనగాడు
వాని కనులు మగమీలనేలురా వాని నగవు రతనాల జాలురా
వాని కనులు మగమీలనేలురా వాని నగవు రతనాల జాలురా
వాని జూచి మగవారలైన మైమరచి మరుల్కొనెడు మరోమరుడు మనోహరుడు రఘురాముడు


సనిదని సగరిగరిరిగ రిసగ రిరిగ రిసగ గరిసనిద రిస గగరి సని దని రిస నిద రిస నిద నిదపమ గరి రఘురాముడు

సనిస సనిససగరిరిగ రిసనిసనిస పదనిస సనిగరిసనిస సనిరిసనిదని నిదసనిదపమ గమద
ని ని ని ని ని ని ని ని ప స ప స ప స ప స  స ప స ప స ప త ధీం తరికిటతక రఘురాముడు రమణీయ వినీల ఘనశ్యాముడు


సెహభాష్ శభాష్.

ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షమునుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో,

ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే మనసింతలోనే దోచినాడే
మోము కలువరేడే మోము కలువరేడే నా నోము ఫలము వీడే
శ్యామలాభిరాముని జూడగ నా మది వివశమాయె నేడే ఎంత సొగసుగాడే

ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై ఉండగా,
అక్కడ స్వయంవర సభామంటపంలో జనక మహీపతి సభాసదులను జూచి:

అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగు పుత్రి సీత
వినయాబ్ధిక సద్గుణ వ్రాత ముఖ విజిత లలిత జలజాత
ముక్కంటి వింటి నెక్కిడ జాచిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెల మాల వైచి పెండ్లాడు

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా - "హా! ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము. దీనిని స్పృశించుటయే మహాపాపము" అని అనుకొనిన వాడై వెనుదిరిగిపోయాడట.

తదనంతరంబున,

ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెరుపు వలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజ గమనముతోన స్వయంవర వేదిక నెంచ
మదన విరోధి శరాసనమును తన కరమున బూనిన యంత

ఫెళ్లు మనె విల్లు గంటలు ఘల్లు మనె
గుభిల్లు మనె గుండె నృపులకు ఝల్లుమనియె జానకీ దేహము

ఒక నిమేషమ్మునందె నయము జయమును భయము విస్మయము కదురా

శ్రీమద్రమారమణ గోవిందో హరి

భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుంది, మరొక్కసారి జై శ్రీమద్రమారమణ గోవిందో హరి

భక్తులరా ఆ విధముగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము గావించినాడు. అంతట,

భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే
పృథుగుణమణి భాగ్యోపేతన్ సీతన్
భూతలనాథుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే

శ్రీమద్రమారమణ గోవిందో హరి

సాహితీ సౌరభం: శుభం

Comments

Popular posts from this blog

ఆలూరు రంగనాథ శతకం

శివరాత్రి శివుని పద్యాలు

ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం